పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పి.డి.యాక్ట్ కింద కేసులు నమోదు .

 


*పేర్ని జయసుధ గోదాములో 

3 వేల బస్తాలు కాదు... 4840 బస్తాలు మాయం* 

జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయంపై లోతుగా విచారణ

తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం... సాక్ష్యాధారాలతో ప్రజాక్షేత్రంలో నిలబెడతాం 

తనిఖీలకు సహకరించ లేదు 

రెండో గోడౌన్ పైనా  అనుమానాలు ఉన్నాయి 

పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ చేస్తే పి.డి.యాక్ట్ కింద కేసులు నమోదు 


తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 

తెనాలి (ప్రజా అమరావతి);

‘శ్రీమతి పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేశాం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పద’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్  స్పష్టం చేశారు. ఆ గోడౌన్ లో 3 వేల బస్తాలు కాదు... 4840 బస్తాలు మాయం అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి... ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంతో దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందుపెడతామని అన్నారు.  కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. అక్కడే ఉన్న రెండో గోదాముపైన అనుమానాలు ఉన్నాయని అన్నారు.  మంగళవారం తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా  మంత్రి నాదెండ్ల  మాట్లాడుతూ... పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలోని 1300 రైస్ మిల్లులకు అందించి బియ్యంగా మారుస్తాం. ఆ బియ్యాన్ని రాష్ట్రంలోని 104 గోడౌన్లలో భద్రపరుస్తాం. ఇక్కడ నిల్వ చేసిన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలకు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సరఫరా చేస్తాం.  

సాఫ్ట్ వేర్ అమలు చేస్తున్నామనగానే లేఖ రాశారు 

పౌరసరఫరాల శాఖలో సంస్కరణలు  తీసుకురావాలని నవంబర్ 26న సివిల్ సప్లైస్ ఎండీ  మనజీర్ జిలాని ఐఏఎస్ “వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్”  అనే సాఫ్ట్ వేర్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది? ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ భద్రపరచాలి? వచ్చే సీజన్ లో ఎంత వరకు ధాన్యం కొనుగోళ్లు చేయాలి? వంటి సమాచారం పొందుపరిచే విధంగా ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. అదే రోజు గోడౌన్ యాజమానులకు, వాళ్ల మేనేజర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆన్ లైన్ లో  ట్రైనింగ్ ఇచ్చారు. ఏ విధంగా తనిఖీలు చేసి ఆన్ లైన్ లో నమోదు చేయాలో శిక్షణ ఇచ్చారు. నవంబర్ 27వ తేదీన తమ గోదాముల్లో స్టాక్స్ తగ్గిందని, మూడు వేల బ్యాగుల రేషన్ బియ్యం షార్టేజి కనబడుతుందని వేబ్రిడ్జ్ లో పొరపాటు వల్ల ఇలా జరిగిందని జె.ఎస్. గోడౌన్ వారు లేఖ రాశారు.  గోడౌన్ లో మాయమైన బియ్యానికి ఎంత విలువైతే అంత డబ్బులు చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు.  

*ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం* 

ఆ లేఖ చూడగానే... అసలు జేఎస్ గోడౌన్స్ లో స్టాక్ ఎంతుంది..? అనే సమాచారాన్ని  స్టాక్ రిజిస్టర్ బట్టి ప్రాథమిక సమాచారాన్ని జాయింట్ కలెక్టర్  నుంచి డిసెంబర్ 4వ తేదీన తెప్పించుకున్నాం. ప్రాథమిక సమాచారం బట్టి 3 వేల బస్తాలు కాదు 3708 బస్తాలు తగ్గాయని తెలిసింది.  డిసెంబర్ 10న  సివిల్ సప్లైస్ ఎండీ  చట్టప్రకారం డబుల్ పెనాల్టీ వేయాలని, జేఎస్ గోడౌన్ ను బ్లాక్ లిస్టులో ఉంచాలని నిర్ణయించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమైన రేషన్ బియ్యంపై లోతైనా విచారణకు ఆర్డీవో, సివిల్ సప్లైస్ మేనేజర్, లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్ తో కమిటీ వేశారు. జేఎస్ గోడౌన్ లో డిసెంబర్ 16వ తేదీన తనిఖీలు నిర్వహిస్తామని 13వ తేదీన నోటీసులు జారీ చేశాం. నోటీసులు జారీ చేసిన రోజే కోటి రూపాయల డీడీలను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ జేఎస్ యాజమాన్యం అందించింది. 16వ తేదీన సిబ్బంది తనిఖీలకు వెళ్లినా సహకరించలేదు. కనీసం ఎవరూ రాకపోవడంతో- పై అధికారుల అనుమతితో లాయర్ల సమక్షంలో పంచనామా చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరపడానికి అక్కడ ఉన్న స్టాక్ 4093 బస్తాలు మండల లెవల్ స్టాకింగ్ పాయింట్లకు తరలించారు. దీన్ని మొత్తం వీడియో కెమెరా ద్వారా చిత్రీకరించాం. 

రిజిస్టర్ ట్యాంపర్ చేసే ప్రయత్నం 

వేబ్రిడ్జ్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పొరపాటున స్టాక్ తగ్గింది అని జేఎస్ యాజమాన్యం చెబుతోంది.   వీళ్లు మరిచిపోయారో... లేక విచారణలో బయటకు రాదో అనుకుంటున్నారో పక్కనే ఉన్న సత్య వేర్ హౌస్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందనిగానీ, స్టాక్ తగ్గిందని చెప్పలేదు. స్టాక్ రిజిస్టర్, లారీ వేబ్రిడ్జ్ ను ట్యాంపర్ చేసి ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. అందిన రిపోర్టు ప్రకారం 243 మెట్రిక్ టన్నులు అంటే 4840 బస్తాలు తగ్గాయని నిర్ధారణ అయ్యింది. నిబంధనల ప్రకారం 2 కోట్ల 23లక్షల 56వేల రూపాయలు చెల్లించారు.  చాలా మంది సంబంధిత గోదాము యజమాని కుటుంబంపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు. తప్పు చేస్తే ఎవరూ తప్పించుకోలేదు.  రూల్‌ ఆఫ్‌ లా ఇంప్లిమెంట్‌ కావాల్సిందే. జేఎస్ గోడౌన్ 2021లో పౌర  సరఫరాల శాఖకు అప్పగించారు. అక్కడ సుమారు 5వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని భద్రపరుస్తాం. అటువంటి గోడౌన్ లో  243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దారి మళ్లించారు. లెక్కలతో సబంధం లేకుండా ప్రజల సొమ్ము స్వలాభం కోసం దారి మళ్లించారు. కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకు హామీ ఇస్తున్నాం. వందకు వందశాతం న్యాయం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.  ప్రభుత్వ ఆస్తులు కాపాడుకునేలా మార్పు తీసుకొస్తామ”న్నారు.

Comments