*ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం!*
*ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయం*
*పండుగ వాతావరణంలో మెగా పిటిఎం నిర్వహణ*
*చాగంటి సూచనలమేరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలు*
*పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష*
అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరుశాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... పదోతరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ఫ్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల ఎసెస్ మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆయా కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వతేదీన నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పిటిఎం సమావేశాలకు హాజరు కావాలని అన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్బాటాలకు తావీయ వద్దని స్పష్టంచేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పిటిఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు తాను కూడా హాజరుకానున్ననట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. 10వతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపర్చేందుకు 100రోజుల ప్రణాళికను అమలు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కెజి టు పిజి కరిక్యులమ్ ప్రక్షాళనపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్, సామాజిక బాధ్యత పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని అన్నారు. ముఖ్యంగా చిన్నతనం నుంచే బాలలు, బాలికలు సమానమేనన్న భావన కలిగించేలా లింగ సమానత్వం, సివిక్ సెన్స్ పై అవగాహన పెంచాలని తెలిపారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు గొడ్డలిపెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జిఓ 117ను రద్దుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, ఈ సమావేశాలకు స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. స్కూలు మైదానాలను జాబ్ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని మంత్రి స్పష్టంచేశారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.
addComments
Post a Comment