బ్రతుకు తెరువుకు ఊరువిడిచి వెళితే భూమి కబ్జా.



*బ్రతుకు తెరువుకు ఊరువిడిచి వెళితే భూమి కబ్జా


*

*టీడీపీ కట్టించిన నిర్మాణాలని.. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కక్ష*

*కొరముట్ల శ్రీనివాసుల అండతో అక్రమ కేసులు పెట్టి కొట్టారంటూ బాధితులు ఆవేదన*

*గ్రామాల్లో మౌలిక వసతులకు పలువురు విజ్ఞప్తి*

మంగళగిరి (ప్రజా అమరావతి);


బ్రతుకు తెరువుకు ఉన్న ఊరు విడిచి వెళితే.. తమ ఊరు ప్రకాశం జిల్లా కోవిలంపాడులోని 3ఎకారల 37 సెంట్ల భూమిని కబ్జా చేశారని.. కబ్జా దారుల నుండి తమ భూమిని విడిపించాలని పాత గుంటూరులో నివాసం ఉంటున్న ఎన్. లక్ష్మి అనే మహిళ నేడు మంళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో నేతలు  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ శాసనమండలి చైర్మన్ MA షరీఫ్, సూర సుధాకర్ రెడ్డిలకు వినతి ఇచ్చి న్యాయం కోసం అభ్యర్థించారు.   వారి నుండి అర్జీలు స్వీకరించిన నేతలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.



ముస్లిం పిల్లల భవిష్యత్ కోసం గత టీడీపీ ప్రభుత్వంలో బాలికల హాస్టల్ నిర్మాణం, ఐటీఐ కళాశాల మంజూరు చేసి నిర్మాణం పూర్తి అయినా గత ఐదేళ్లు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  ముస్లింల పట్ల, టీడీపీ కట్టించిన నిర్మాణాల పట్ల కక్ష పూరిత ధోరణితో కళాశాలకు అధ్యాపక సిబ్బంది, హస్టల్ సిబ్బందిని కేటాయించకుండా చేశారని.. నరసరావుపేటకు చెందిన పలువురు ముస్లింలు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం తిమ్మయ్యగారిపల్లెకు చెందిన హరిబాబుతో పాటు పలువురు విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ నాయకుడు రాటకొండ సుబ్బరాయుడు తన పొలానికి దారికోసం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రోద్బలంతో తమపై అక్రమ కేసులు పెట్టి పోలీసులతో కొట్టించారని.. దానికి అప్పటి తాహశీల్దార్ శీరిష, స్థానిక పోలీసులు సహకరించారని.. తాహశీల్దార్ వలన గతంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని.. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రకాశం జిల్లా దర్శిమండలం బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఉప్పు చిన్న అంజయ్య విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని గత ప్రభుత్వంలో  తమకు తెలియకుండా చింతా హనుమయ్య అనే వ్యక్తి వారి పేరుమీద ఆన్ లైన్ లో ఎక్కించుకున్నారని.. దాన్ని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 

అధికారులు వైసీపీ నేతలతో కుమ్మక్కై తమభూమికి దోంగ పత్రాలు సృష్టించి ఇతరుల పేరుమీదకు ఎక్కించారని.. తమ భూమికి అసలైన యజమానులం తామేనని విచారించి న్యాయం చేయాలని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి. సిద్దరాంపురం గ్రామానికి చెందిన వడ్డె గంగన్న విజ్ఞప్తి చేశాడు. 

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోమటి గుంట  గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ లు లేవని వాటిని నిర్మించి పల్లె అభివృద్ధికి సహకరించాలని కోమటిగుంట గ్రామస్తులు పలువురు నేడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

రాష్ట్రంలో టైలరింగ్ రంగం దీన స్థితికి చేరుకుంటుందని.. టైలరింగ్ రంగం వృత్తిమీద ఆధారపడిన వారికి సరైన పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని టైలర్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ స్వామి వినతి ఇచ్చి అభ్యర్థించారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం పరిధిలోని అంకాలమ్మ చెంచుగూడెం నందు 26 చెంచు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని.. తమకు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నామని.. తమకు ఉపాధి కల్పించాలని అలాగే చెంచు గూడెంలో కనీసమౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కాలినీవాసులు పలువురు విజ్ఞప్తి చేశారు. 

కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఎన్. అరుణదేవి విజ్ఞప్తి చేస్తూ మాజీ సైనికోద్యోగికి చెందిన పొలాన్ని ప్రభాకర్ అనే వ్యక్తి అధికారులను మ్యానేజ్ చేసి ఆక్రమించుకున్నాడని.. వాస్తవాలను పరిశీలించి మహేష్ కు న్యాయం చేయాలని విన్నవించారు. 

కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని.. గ్రామంలో 600 కుటుంబాలు ఉన్నాయని.. పది, 15 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరాచేయడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని.. దయచేసి సమస్యను పరిష్కరించాలని  బి. పెద్ద వీరూపాక్షి కోరారు.

నక్కపల్లి మండలం దేవరం గ్రామంలో  సర్వే నెంబర్ 244/1 లో ఉన్న 6.44 సెంట్ల ప్రభుత్వ భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాల్సిందిగా.. అలాగే 240/2లో ఉన్న ప్రభుత్వ భూమిని  కమ్యూనిటీ హాల్ ఇతర అవసరాల నిమిత్త కేటాయించాల్సిందిగా  ఆ గ్రామానికి చెందిన S. అప్పారావు అనే వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. 

గతప్రభుత్వంలో నిలిచిపోయిన ఫీజురియంబర్స్ మెంట్ ఇప్పించాలని పలువురు విద్యార్థులు అభ్యర్థించగా.. తమ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని మరికొంత మంది నిరుద్యోగులు అర్జీలు ఇచ్చారు.

Comments