అమరావతి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి
• తీర ప్రాంత నిర్వహణపై ఎన్.సి.సి.ఆర్. రూపొందించిన ప్రణాళిక విడుదల చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్
• తీర ప్రాంత నిర్వహణకు ఎన్.సి.సి.ఆర్., ఏపీసీజడ్ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం
రాష్ట్రానికి 973 కి.మీ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం... తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత అనే ఆందోళన కలిగిస్తోందని, కోత ప్రమాదాన్ని నివారించేoదుకు ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్నారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామనీ, రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి తన నివాసంలో తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికను విడుదల చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టర్ రీసెర్చ్ (ఎన్.సి.సి.ఆర్.) నిపుణులు ఈ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక తీర ప్రాంతంలో తీర ప్రాంతాల కోత, కెరటాల శక్తి తగ్గింపుతోపాటు కోత, కెరటాల తీవ్రత నుంచి వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకూ ఉపయోగపడుతుందని ఎన్.సి.సి.ఆర్. నిపుణులు తెలిపారు. కొత్త ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్లు లాంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎన్.సి.సి.ఆర్., ఆంధ్ర ప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సమావేశంలో పీసీబీ సభ్య కార్యదర్శి శ్రీ బి.శ్రీధర్, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీ శరవణన్, డా.పి.వి.చలపతిరావు, ఎన్.సి.సి.ఆర్. శాస్త్రవేత్తలు డా.ఎం.వి.రమణమూర్తి, శ్రీ వి.రామనాథన్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment