*ఘనంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు*
*•సంబరాల్లో పాల్గొని ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సి.ఎస్. డా.కె.ఎస్.జవహర్ రెడ్డి*
అమరావతి, జనవరి 11 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు గురువారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అద్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ఉద్యోగులకు, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పంటలు సమృద్దిగా పండి ఇళ్లకు చేరే తరుణంలో జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలు, రైతులు ముంగిళ్లలో సుఖ సంతోషాలు, శాంతి ఆనందం వెల్లివిరిసేలా చేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు, బోగిమంటలతో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిభింబించే విధంగా జరుపుకునే ఈ పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాదికి ఎంతో ప్రత్యేకత ఉందని, మానవాళికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామచంద్రుని జన్మభూమి అయిన అయోద్యలో శ్రీరామచంద్రుని ఆలనిర్మాణం జరుగుచుండటంతో ఈ ఏడాది ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుందన్నారు.
తొలుత ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అద్యక్షుడు కె. వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిభింబించే విధంగా జానపద కళలైన కర్రసాము, కత్తి సాము, తప్పెటగుళ్లు కళాకారులు, పలు రకాల రంగవల్లులతో మహిళా ఉద్యోగినులు, హరిదాసు, గంగిరెద్దులు, సన్నాయి, మేళతాళాల మధ్య యెడ్ల బండిలో సి.ఎస్. కు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆయనను ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళా ఉద్యోగినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కూచిపూడి నృత్యచారిణి శ్రీమతి మల్లిశెట్టి అనూషా నాయుడు శిష్య బృందంచే ప్రదర్శించిన కూడిపూడి నృత్యం, ధ్వన్యనుకరణ చక్రవర్తి భవిరి రవి ప్రదర్శించిన మిమిక్రీ కార్యక్రమం మరియు సచివాలయ ఉద్యోగులచే ప్రదర్శించబడిన శ్రీకృష్ణ రాయబారం అనే పద్య నాటకం కార్యక్రమం ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఆంద్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొని సంక్రాంతి పండుగకు మూడు రోజుల ముందుగానే సచివాలయంలో సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఎన్. సత్య సులోచన, కార్యదర్శి పి.శ్రీకృష్ణ తదితరులతో పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
addComments
Post a Comment