విజయవాడ, (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో జల రవాణా, కార్గో రవాణాకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నదని దీనికి సంబంధించి స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ శ్రీ దిలీప్ కుమార్ దంతులూరి అన్నారు.
రాష్ట్రంలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి తీసుకోవలసిన
చర్యలు గురించి స్టేక్ హోల్డర్స్ తో విజయవాడ ' వివంత ' హోటల్ లో బుధవారం నిర్వహించిన సమావేశం అనంతరం పాత్రికేయులకు శ్రీ దిలీప్ కుమార్ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయని వీటి ద్వారా 8 మిలియన్ టన్నుల ఎగుమతి అవుతోందన్నారు. భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్ర ప్రదేశ్ లో ముందుగా ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఈ రోజు నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలో 150 మంది వరకూ స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారని వీరందరూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దిలీప్ కుమార్ అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్. వి. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ కు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వెజర్ యాక్ట్ ను సవరణ చేసిందని తెలిపారు. వెజర్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఛానల్ సర్వే అన్నింటినీ ఒకే గొడుగు క్రిందకు తెచ్చేందుకు ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఎన్ టి ఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం నుండి హరిశ్చంద్రపురం లింగాయపాలెం మార్గాలలో కార్గో రవాణాకు సంబంధించి సర్వే జరుగుతున్నదన్నారు. గోదావరి నదిలో సీతానగరం నుండి తాటిపూడి వరకూ మరో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ముక్త్యాల నుండి మచిలీపట్టణం, ముక్త్యాల నుండి కాకినాడ పోర్టు కు జలరవాణా అనుసంధానం పై సర్వే లు జరుగుతున్నాయన్నారు. పెన్నా నదిలో గండికోట నుండి కృష్ణపట్నం పోర్టుకు క్రూజ్ వెజర్ రవాణాకు సర్వే జరుగుతోందన్నారు. కృష్ణా జిల్లాలో 8 ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ' టెంపుల్ టూరిజం ' ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సాగరమాల ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్ ను అందజేశామన్నారు. రాష్ట్రంలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి ఈ అథారిటీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని సి ఇ ఓ కృష్ణా రెడ్డి తెలిపారు.
ముందుగా రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ గుడివాడ అమరనాధ్ రాష్ట్రంలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వర్చువల్ సందేశాన్ని సమావేశంలో ప్రదర్శించారు.
ఈ సమావేశంలో జలవనరుల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శ్రీ నారాయణ రెడ్డి, హెరిటేజ్ క్రూజ్ కలకత్తా ప్రతినిధి శ్రీ రాజ్ సింగ్, డాక్టర్ సి. రాజగోపాలరెడ్డి, ఏ. నారాయణ రెడ్డి, కె. దినేష్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ భాస్కర రావు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment