*ఫార్మల్ ఎడ్యుకేషన్ తో వృత్తి నైపుణ్యాభివృద్దికై డ్రాప్టు ఫాలసీ*
*•నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 9 నుండి పి.జి. విద్యార్థులకు వృత్తి నైపుణ్యాభివృద్ది*
*ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి*
అమరావతి, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి): తొమ్మిదో తరగతి నుండి పి.జి. విద్యార్థుల వరకూ ఫార్మల్ ఎడ్యుకేషన్ తో పాటు వృత్తి నైపుణ్యాన్ని కూడా అభివృద్ది పర్చుకునేందుకు వీలుగా డ్రాప్టు ఫాలసీని రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి పాఠశాల, ఉన్నత, కళాశాల విద్యా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారానే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సోమవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం సి.ఎస్. కాన్సరెన్సు హాల్ లో పాఠశాల, ఉన్నత, కళాశాల విద్యా శాఖల అధికారులతో ఆయన సమావేశమై రాష్ట్రంలో విద్యాభివృద్దికై అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువును పూర్తి చేసుకుని బయటకు రాగానే ఏదో ఒక ఉపాధిలో స్థిరపడి జీవనోపాధి పొందే విధంగా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందుకు వారు ఫార్మల్ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా శిక్షణను ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని, నిరుద్యోగ సమస్య కూడా సాద్యమైనంత మేర సమసిపోతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందుకై బహిరంగ మార్కెట్ తో పాటు పలు కంపెనీల అవసరాలను బట్టి డిమాండు ఉన్న కోర్సుల్లోను మరియు స్వయం ఉపాధిలో స్థిరపడేందుకు అనుగుణమైన కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ నిచ్చే విధంగా డ్రాప్టు పాలసీని సత్వరమే రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులు పలు ఒకేషనల్ కోర్సుల్లోను చేరే విధంగా, సాంకేతిక విద్యను పెద్ద ఎత్తున అభ్యసించే విధంగా ప్రోత్సహించాలన్నారు.
మిషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో శతశాతం అమలుకు పాఠశాల స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల నమోదుకు పాఠశాల, ఉన్నత విద్యా శాఖలు తీసుకుంటున్న చర్యలను, అమ్మఒడి పథకం అమలు సందర్బంగా పెరిగిన విద్యార్థుల నమోదు శాతాన్ని ఆయన సమీక్షించారు. ఫీజు రీఇంబర్సుమెంట్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాల అమలు వల్ల కళాశాలల్లో, విద్య విద్యాలయాల్లో పెరిగిన విద్యార్థుల నమోదు శాతాన్ని కూడా ఆయన సమీక్షించారు. ఆరవ తరగతి నుండి 12 వ తరగతి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కరికులం అమలుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తూ ఈ డిశంబరు మాసానికల్లా కరికులంను రూపొదించాలని ఆదేశించారు. ఆదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కరికులం అమలుకు అర్హులైన టీచర్ల భర్తీని ఈ ఏడాది డిశంబరు కల్లా పూర్తి చేయాలన్నారు. ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్సు యాప్ ట్యూటర్లను, ఫెసిలిటేటర్లను ఐ.టి. మరియు ఎ.పి.టి.ఎస్.ద్వారా సమకూర్చుకోవాలని సూచించారు.
రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్యామలరావు, ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రా రెడ్డి, కళాశాల విద్య శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment