*రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వస్త్రాల విక్రయం*
*•ఉద్యోగులు ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలను దరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలి*
*•రాష్ట్ర సచివాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు*
*రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె.సునీత*
అమరావతి, ఆగస్టు 7 (ప్రజా అమరావతి): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వస్త్రాలను సచివాలయంలోని ఆప్కో విక్రయ శాల ద్వారా ఈ నెలాఖరు వరకు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె.సునీత ప్రకటించారు. హుందాతనాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని కల్పించే చేనేత వస్త్రాలను ఉద్యోగులు అంతా విరివిగా ధరిస్తూ చేనేత కార్మికులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వస్త్రాలను తప్పని సరిగా ధరించాలనే విదానాన్ని అమలు పర్చారన్నారు. అయితే శనివారం సెలవు దినం అవ్వడం వల్ల ఆ సాంప్రదాయం గాడి తప్పిందన్నారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వస్త్రాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలు ఎంతో సౌకర్య వంతంగా ఉంటాయని, పురాతన కాలం నుండి చేనేత వస్త్రాలను ధరించడ మనేది మన సాంప్రదాయంగా కొనసాగుతున్నదని, ఉద్యోగులు అంతా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో 90 విక్రయ శాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వినియోగదారులను ఆకర్షించే విధంగా నూతన డిజైన్లతో పలు వస్త్రాలను ఆ విక్రయ శాలల ద్వారా విక్రయించడం జరుగుచున్నదన్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు 3 నుండి 5 వాయిదాల్లో కొనుగోలు సొమ్మును చెల్లించేదుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేనేత కార్మికులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట రామి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె.సునీత చొరవతోనే సచివాలయం ఆవరణలో ఆప్కో విక్రయ శాలను ఏర్పాటు చేయడం జరిగిందటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
చేనేత వస్త్రాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చేనేత వస్త్రాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి బహుమతులను అందజేశారు. మహిళా విభాగంలో సరళ, కనకదుర్గ, సునీత మరియు పురుషుల విభాగంలో ఇమామ్ వలీ, మోహన్ రావు, ప్రసాద్ తదితర ఉద్యోగులకు ఈ బహుమతులను అందజేశారు.
రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు ఎన్.సత్య సులోచన, జనరల్ సెక్రటరీ పి.శ్రీక్రిష్ణ తదితరులతో పాటు సచివాలయ మహిళ, పురుష ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ వెడుకల్లో పాల్గొన్నారు.
addComments
Post a Comment