ఆక్సిజన్ అందక కాదు..
అనారోగ్యంతోనే మృతి చెందినట్లు డాక్టర్ల నిర్థారణ
- వైద్య సేవల్లో ఎటువంటి లోపం లేదు
- పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందుబాటులో ఉంది
- పుకార్లు నమ్మకండి
- జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్
నెల్లూరు, జూలై 22 (ప్రజా అమరావతి):
నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆక్సిజన్ అందక ఆరుగురు రోగులు మృతి చెందారన జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అనారోగ్య కారణాలతోనే మరణించారని వైద్యులు నిర్ధారించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని M.I.C.U వార్డును, ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వారి సహాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు కూడా ఆసుపత్రిలో బాగా చూస్తున్నారని, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని కలెక్టర్ కు చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో జరిగిన మరణాలపై డిఎంహెచ్వో, సూపరింటెండెంట్ తో పూర్తిస్థాయిలో విచారణ జరిపించామని, చనిపోయిన ఆరుగురు కూడా అనారోగ్య కారణాలతో మరణించారని వైద్యులు నిర్ధారించారని, వీరంతా పెద్ద వయస్కులని చెప్పారు. ఎం ఐ సి యు లో అత్యవసర కేసులకు వైద్య చికిత్సలు జరుగుతున్నాయని, వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి రోగులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ కొరతలేదని, 23 కె ఎల్ లిక్విడ్ ఆక్సిజన్ 24 గంటలు అందుబాటులో ఉందని, పైపులైన్ల ద్వారా పూర్తిస్థాయిలో సరఫరా జరుగుతుందని చెప్పారు. 300 సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేదని గుర్తించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో సదుపాయాలపై ఇటీవలే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించామని, మౌలిక సదుపాయాల కోసం నిధులను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో లిఫ్టులు పనిచేయకపోతే, వాటిని కూడా మరమ్మతులు చేసి అందుబాటులో తీసుకొచ్చామని, ఇంకా అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్, ఇతర వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలెవ్వరూ పుకార్లు నమ్మవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్ఓ పెంచలయ్య, సూపరింటెండెంట్ సిద్ధా నాయక్, వైద్యులు ఉన్నారు.
ఆస్పత్రిలో బాగా చూస్తున్నారు
- ఖాజావుల్లా, రోగి సహాయకుడు
...........
అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మను ఆరు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించామని, ఉదయం, సాయంత్రం వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారని, చనిపోయిన వారు చాలా సీరియస్ గా వచ్చారని, డాక్టర్లు మాత్రం బాగా చూశారని మీడియాకు వివరించారు.
చనిపోయిన వారు పిల్లలు కాదు... పెద్ద వయస్కులు
................
ఆసుపత్రి సూపరంటెండెంట్ సిద్దా నాయక్
నెల్లూరు సర్వజన ఆసుపత్రి Dr. I.V. రామ చంద్ర రావు( జనరల్ మెడిసిన్ హెడ్) వివరణ.
.........................
నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం అవాస్తవమని ఆసుపత్రి సూపరంటెండెంట్ సిద్దా నాయక్,
నెల్లూరు సర్వజన ఆసుపత్రి Dr. I.V. రామ చంద్ర రావు( జనరల్ మెడిసిన్ హెడ్) వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చనిపోయినవారు పిల్లలు కాదని, పెద్ద వయసు వారని, దీర్ఘ కాలిక రోగులని, వీరంతా తీవ్రమైన అనారోగ్యంతో ఈ ఆసుపత్రికి వచ్చారని, వీరికి వైద్య సేవలో ఎటువంటి లోపం లేకుండా డాక్టర్లు, వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారని చెప్పారు. ఆరుగురు ఒకేసారి చనిపోలేదని, మరణాలన్నీ 21వ తేదీ ఉదయం 9.30 నుండి సాయంత్రం 6.30 మద్య జరిగాయని, వీరంతా గత 3 నుండి 5 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. చనిపోయిన వారంతా జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వారని, మృతదేహాలను ఒకే వాహనంలో తరలించామని ప్రచారం చేయడం కూడా అవాస్తవమన్నారు.
addComments
Post a Comment