ఇకపై నెలకో వార్డులో రచ్చబండ
- ఆ వార్డు సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తా
- 37వ వార్డులో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ భరత్
రాజమండ్రి, జూన్ 10 (ప్రజా అమరావతి): ఇకపై నెలకో వార్డులో 'రచ్చబండ' కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు, ఆ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నా వెనువెంటనే పరిష్కరిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. శనివారం నగరంలోని 37వ వార్డు లలితా నగర్ వినాయకుని గుడి వద్ద 'వైసీపీ వార్డు కార్యాలయం'ను ఎంపీ భరత్, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ నగరంలో ప్రతీ వార్డులో పార్టీ కార్యాలయాలను ఆయా వార్డు ఇన్చార్జుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. నగరంలో ప్రప్రథమంగా 37వ వార్డులో బాలాజీ రెడ్డి ఔదార్యంతో రెడ్డి, సూరిబాబు, సుందర్సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ఏర్పాటు కావడం సంతోషకరమని అన్నారు. రానున్న పదిహేను ఇరవై రోజుల్లో నగరంలోని అన్ని వార్డులలో పార్టీ కార్యాలయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యాలయాల నుండే ఆయా వార్డు ప్రజలకు కావాల్సిన సేవలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రతీ నెల నిర్వహించే రచ్చబండకు గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు హాజరై ప్రజలతో మమేకం అవుతామని ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, మార్గాని సురేష్, కాంతారాం పాటిల్, సంకిస భవానీ ప్రియ, ఎన్వీ శ్రీనివాస్, నక్కా నాగేష్, ప్రవీణ్ చౌదరి, మజ్జి అప్పారావు, పీతా రామకృష్ణ, 37వ వార్డు లీడర్స్ బాలాజీ రెడ్డి, సుబ్బవరపు సూరిబాబు, సుందర్సింగ్ సోడదాసి, కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment