మళ్లీతెరిచే వినతుల పరిష్కారంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలి
వినతుల పరిష్కారంపై సిబ్బందిలో అవగాహన కల్పించాలి
స్పందన వినతులపై జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఆదేశాలు
విజయనగరం, మే 15 (ప్రజా అమరావతి): స్పందన కార్యక్రమంలో వచ్చే వినతులు పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్న తర్వాత ఆయా పరిష్కారంపై అర్జీదారుల్లో అసంతృప్తి వ్యక్తమైతే అటువంటి వినతులను మళ్లీతెరచి పరిష్కరించాల్సి వుంటుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ చెప్పారు. అటువంటి వినతులను మళ్లీ పరిష్కారం కోసం తెరచినపుడు ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు వాటిని పరిష్కరించిన తీరుపై ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో స్పందన కార్యక్రమం ద్వారా, ఇటీవల ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందుతున్న వినతులకు సంబంధించి అర్జీదారుల్లో వాటి పరిష్కారం పట్ల సంతృప్తి వ్యక్తంకావడం లేదని దీనిపై అధికారులంతా ఆలోచించాలన్నారు. అర్జీదారుల్లో సంతృప్తి వ్యక్తమైతేనే ఆయా వినతులు సరైన రీతిలో పరిష్కరించినట్లు భావించాల్సి వుంటుందన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల ద్వారా అందుతున్న వినతుల పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. పరిష్కారం కోసం మళ్లీ తెరచిన ప్రతి వినతిని పరిష్కరించేందుకు ఒక అధికారిని నియమించాలన్నారు. విజయనగరం రూరల్ మండలంలో గత రెండు నెలల్లో మళ్లీ తెరచిన వినతులపై కలెక్టర్ సమీక్షించారు. ఏ కారణంతో వాటిని మళ్లీ తెరిచారనే అంశంపై ఆయా అధికారుల వివరణ అడిగారు. వినతుల పరిష్కారంలో కిందిస్థాయి సిబ్బందిలో తగిన అవగాహన కల్పించేందుకు వారు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వాటిని ఎలా పరిష్కరించడం ద్వారా ప్రజల్లో, అర్జీదారుల్లో సంతృప్తి కలిగించవచ్చనే విషయంపై కలిగించాలన్నారు.
భవన నిర్మాణ కార్మికులు తదితర వర్గాల వారు జిల్లా కలెక్టర్కు తమ సమస్యలపై వినతులు అందించారు.
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణ, పద్మలీల, బి.ఎస్.ఎన్.దొర తదితరులు కూడా వినతులు స్వీకరణ చేపట్టారు.
యునిసెఫ్ పోస్టర్లు ఆవిష్కరణ
రాష్ట్రంలో బాల్యవివాహాలు నిరోధించడం, బాలికల ఆరోగ్యం, విద్యపై రూపొందించిన పోస్టర్లు, బాలికల్లో పోషకాహార లోపం నివారణ, బాలలు, యుక్త వయస్సు వారిని మాదకద్రవ్యాలకు దూరంగా వుంచడం తదితర అంశాలపై అవగాహన కల్పించే దిశగా యునిసెఫ్(ఐక్యరాజ్యసమితి బాలల విద్య అభివృద్ధి నిధి) రాష్ట్ర ప్రభుత్వంతో కలసి రూపొందించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ తదితరులు స్పందన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక పరివర్తన, ప్రచార సమన్వయకర్త బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment