నెల్లూరు మే 8 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తుది దశకు చేరుకుంద
ని, ఈ కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించిన మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
తొలుత గ్రామంలో సుమారు రూ. 2.79 కోట్లతో నిర్మించిన నూతన సచివాలయ భవనం, అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ కాలవలు మొదలైన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో గడపగడపకు వెళ్లిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని తెలుసుకుని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రతి గడపలోనూ మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం శంకుస్థాపన శిలాఫలకాలు మాత్రమే వేసేవారని, తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులు చేపట్టడం, సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందించడమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. గడపగడప కార్యక్రమంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడం, ఆ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అలాగే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికి తమ సమస్యలను విన్నవించుకునే అవకాశం కలిగిందని, ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత, ఎంపీడీవో నగేష్ కుమారి, తాసిల్దార్ ప్రసాద్, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment