రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం, మంగళగిరి (ప్రజా అమరావతి);
*పీసీపీఎన్డీటీ చట్టాలపై పర్యవేక్షణ అవసరం*
*పీసీపీఎన్ డీటీ, సరోగసీ చట్టాల అమలు బాధ్యత మనదే*
*లింగనిర్థారణ పరీక్షలపై నిఘా ఉంచండి*
*అనుమతులు లేకుండా ఐవీఎఫ్, ఏఆర్టీ, సరోగసి చేస్తున్న ఆస్పత్రుల వివరాలు సేకరించండి*
*బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి*
*ప్రభుత్వ చర్యల వల్ల ఆడపిల్లల నిష్పత్తి పెరిగింది*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని*
*పీసీపీఎన్ డీటీ, ఎఆర్టీ , సరోగసీ రెగ్యులేషన్ చట్టాల స్టేట్ బోర్డుల సమావేశంలో మంత్రి రజిని*
సమాజానికి ఎంతో కీలకంగా ఉన్న ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ (పీసీపీఎన్ డీటీ), సరోగసీ చట్టాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ (పీసీపీఎన్ డీటీ), సరోగసీ, ఎఆర్టీ చట్టాల రాష్ట్రస్థాయి అమలు బోర్డుల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లింగనిర్థారణ పరీక్షలు ఎలా జరగుతున్నాయనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. పుట్టబోయే బిడ్డ ఆడ, మగా.. ఎవరనే చెప్పే పరిస్థితులు ఎక్కడా ఉండటానికి వీల్లేదన్నారు. లింగనిర్థారణ పరీక్షలు చట్ట రిత్యా నేరం అని తెలిపేలా అన్ని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో గోడపత్రికలు, బోర్డులు ఏర్పాటుచేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే ఎఎన్ ఎంలు, ఆశా వర్కర్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
*అనుమతుల విషయంలో కఠినంగా ఉండండి*
ఐవీఎఫ్, సరోగసి లాంటి ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్న ఆస్పత్రుల విషయంలో అధికారులు నిఘా పెట్టాలన్నారు. అనుమతులు లేకుండా సరోగసి లాంటి చికిత్సలు అందిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్ ఆస్పత్రుల లైసెన్సులను తనిఖీ చేయాలని, ఆయా ఆస్పత్రులపై కూడా తరుచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార ధోరణితో వ్యవహిరిస్తున్న ఆస్పత్రుల వివరాలను సేకరించాలని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న గైనకాలజిస్టుల సాయం తీసుకోవాలన్నారు. ఈ చట్టాల అమలు బోర్డులో సభ్యులుగా ఉన్న పాడేరు, తాడికొండ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శ్రీదేవితోపాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి తదితరులు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమీషనర్ మరియు డిఎంఇ డాక్టర్ వినోద్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment