నెల్లూరు జనవరి 22 (ప్రజా అమరావతి);
ముత్తుకూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిని 12 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి
చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం ముత్తుకూరు మండల కేంద్రంలో 6 వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి అశేష ప్రజలు విశేష స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలతో మమేకమవుతూ, వారు పొందిన సంక్షేమ లబ్దిని తెలిపే బుక్లెట్ ను అందిస్తూ వారింటి పెద్ద బిడ్డగా వారి సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం ముత్తుకూరు మండల కేంద్రంలో కోటి రూపాయలు నిధులు వెచ్చించి నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని పలకరించి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన వినూత్నమైన కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వమని వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలకు గాను ప్రతి సచివాలయానికి అందజేసిన 20 లక్షల నిధులతో పాటు శాసనసభ్యునిగా కేటాయించిన నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిని 12 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం గ్రామాల్లోని రోడ్లను ఇప్పటికే సిమెంటు రోడ్లతో అభివృద్ధి చేసామన్నారు. సాంకేతిక కారణాలతో నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ అందని వారికి వెంటనే అందజేయుటకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సుదీర్ఘంగా అపరిష్క్తృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నామన్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను మరలా కొనసాగించుటకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణమ్మ, ఎంపిడిఓ ప్రత్యూష, తహసీల్దార్ మనోహర్ బాబు, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment