గృహనిర్మాణ ప్రగతిపై కలెక్టర్ ఆగ్రహం
గుంకలాం జగనన్న కాలనీ సందర్శన
విజయనగరం, డిసెంబరు 06 (ప్రజా అమరావతి) ః
గుంకలాం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ ఎ.సూర్యకుమారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం ఆకస్మికంగా కాలనీని సందర్శించారు. ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టుకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటంపై, సంబంధిత ప్రాజెక్టు మేనేజరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేస్త్రీలను, పనివారిని ఎక్కువమందిని వినియోగించి, ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇటుకల తయారీ యూనిట్లో ఉత్పత్తి పెంచాలని, నాణ్యత ఎక్కడా తగ్గకుండా చూడాలని సూచించారు. కాలనీలో పునాదుల స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లపై, గృహనిర్మాణ శాఖాధికారులను ప్రశ్నించారు. వాటిని వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు. దీనికోసం వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని, వారి ద్వారా, లబ్దిదారులను చైతన్య పరచాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి ఎన్వి రమణమూర్తి, డిఇ రంగారావు, ఎఈ శ్రీనివాసరావు, ప్రాజెక్టు మేనేజర్ శ్రావణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment