ఓటు విలువను గుర్తించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఓటర్ల నమోదుపై అవగాహనా ర్యాలీ
విజయనగరం, డిసెంబరు 05 (ప్రజా అమరావతి) ః
ఓటు విలువను తెలుసుకొని, ప్రతీఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. విజయనగరం నియోజకవర్గంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా, ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ, కలెక్టరేట్ నుంచి కోట జంక్షన్ వరకు సోమవారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతీఒక్కరూ ఓటుహక్కును పొందాలని కోరారు.
మరింత సమర్ధవంతమైన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతోందని కలెక్టర్ చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకొనేందుకు, ఓటును బదిలీ చేసుకోవడానికి, పోలింగ్ స్టేషన్ మార్పునకు అవకాశం ఉందని చెప్పారు. అర్హత గల ప్రతీఒక్కరికీ సమయానికి ఓటుహక్కు పొందేందుకు వీలుగా 17 ఏళ్లకే తమ పేరును నమోదు చేసుకొనే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని చెప్పారు. ఇలా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి 18 నిండగానే, ఓటు హక్కు దానంతట అదే వస్తుందని, మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యాసంస్థలపై ఎక్కువగా దృష్టి పెట్టామని, ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ప్రతీఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, విజయనగరం ఇఆర్ఓ సూర్యనారాయణ, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ శ్రీకర్, తాశిల్దార్ బంగార్రాజు, డిప్యుటీ తాశిల్దార్ కోటేశ్వర్రావు, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ మహేష్, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment