నెల్లూరు, నవంబర్ 24 (ప్రజా అమరావతి): రోజురోజుకు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతూ, గ్రామాల్లో మౌలికవసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామ
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మేజర్ పంచాయతీలో 9వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏసీ కాలనీకి విచ్చేసిన మంత్రిని ప్రజలు గజమాలతో సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 53 లక్షలతో నిర్మించిన సైడ్ కాలువలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఒక పొదలకూరు మేజర్ పంచాయతీలోని గత 9 రోజులుగా చేపడుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రూ. 10.80 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. ఒకపక్క సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతున్నామన్నారు. దళారులు, నాయకులతో సంబంధం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను బటన్ నొక్కి నేరుగా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డేనని చెప్పారు. నాడు నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని, అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు కట్టిస్తున్నామని, ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. పేదలకు అండగా ఉంటూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నగేష్ కుమారి, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment