*వైసీపీ షోకాజ్ నోటీసుపై స్పందించిన రఘురామకృష్ణంరాజు..* వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగాఈ నోటీసుపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. వైసీపీ నుంచి షోకాజ్ నోటీసు వచ్చిందన్నారు. ఏ నాడు తమ పార్టీని కానీ, పార్టీ అధ్యక్షుణ్ని కాని పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలు అనుకున్నట్టుగా జరగడంలేదని ముఖ్యమంత్రికి చెప్పాల్సిన విషయాలు వీడియో ముఖంగా చెప్పానని వెల్లడించారు. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తే దొరకలేదని చెప్పారు. వారం రోజుల్లో  వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో ఉందని, శుక్రవారమే (రేపే) వివరణ పంపిస్తానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.  కాగా  వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరపున షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పది రోజులుగా పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామ రాజు చేస్తున్న వ్యాఖ్యలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేయడం, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై పార్టీ అధినాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో కోరారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ షోకాజ్ నోటీసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


Comments