*మేము కలిస్తే తప్పేంటి? మీకు ఎందుకంత భయం?: సుజానా చౌదరి* అమరావతి: బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివా్‌సలతో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో భేటీ కావడంపై మీడియాలో హల్‌చల్‌ నడిచింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను చూపిస్తూ... ‘కుట్రలు చేసేందుకే ఈ రహస్య భేటీ’ అని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై సుజనా చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాము కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తన రాజకీయాలు పారదర్శకంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ‘‘నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, కామినేని శ్రీనివాస్ గారు పార్క్ హయత్ లోని నా కార్యాలయానికి వచ్చినందుకే నానా హైరానా పడుతున్నారు. మేం కలిస్తే తప్పేంటి? మీకు అంత భయం దేనికి? కంగారొద్దు. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. నేనేదైనా చెప్పే చేస్తా. రమేష్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా వుండి ఎంపీని కలవడంలో మతలబేంటని మీ సాక్షి మీడియా ఆశ్చర్యపోతుంది. ఇంతకీ ఆయన్ను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా?’’ అని సుజనా చౌదరి ట్వీట్‌లో ప్రశ్నించారు.


Comments